శ్రీ చిదానంద సరస్వతి స్వామి
ఆశ్రమ స్థాపకులు
అత్యంత తపోనిష్ఠా గరిష్ఠులైన శ్రీ చిదానంద సరస్వతీ స్వామివారు ఈ యాశ్రమమును 1952న స్థాపించిరి. ఇందు శ్రీ శృంగేరీ పీఠాధిపతులచే పంపబడిన శ్రీ శంకరాచార్యులవారి పాల రాతి విగ్రహము ప్రతిష్టింపబడినది. మారుచున్న జన జీవన విధానమును తలపోసియోయన్నట్లు చిరునగవు చిందులాడు ఈ సుందరమూర్తి నాటి నుండి పూజల నందుకొనుచున్నది.
ఈ యాశ్రమమునకు ప్రక్కనే శ్రీ సోమలింగేశ్వరస్వామి మొదలగు పదునాల్గు దేవాలయముల నిర్మాణములుకూడ శ్రీ చిదానంద సరస్వతీ స్వామివారి ఆధ్వర్యమున ఆ కాలముననే జరిగినవి.
ఈ రెండు సంస్థలకును ఎకరము పైగా స్థలమును సమీపమునగల కేసరపల్లి నివాసియైన శ్రీ దోనపల్లి అనంతకోటి పద్మనాభంగారు దానము చేసిరి. ఈ యాశ్రమమునకు వెనుక దేవాలయ పూజారి నివసించుటకై ఒక యిల్లు నిర్మిపబడియున్నది. పై దేవాలయ సముదాయము నిత్య నైవేద్య దీపారాధనల నందుకొనుచు శోభిల్లుచున్నది.
ఆశ్రమ స్థాపకులైన శ్రీ చిదానంద సరస్వతీ స్వాములవారు పూర్వ నివాసమైన పశ్చిమ గోదావరి జిల్లా “ పూళ్ల " గ్రామములో కుసుమ హర నాథాశ్రమ మనుపేర నొక యాశ్రమము స్థాపించి ఏకాహ సప్తాహాది సంకీర్తన కార్యక్రమముల ద్వారా భక్తి ప్రచారము గావించుచు భజన సంప్రదాయమునకు కూడ పాదుచేసి నీరు పోసి కొంతవరకు సంరక్షించిరి.
ప్రతినిత్యం అన్న దానము చేయుచుండుటయేకాక ప్రతి సంవత్సరం వేద సభలను పండిత సమావేశములను నిర్వహించుచు, వేద శాస్త్ర విద్వాంసులకు సన్మానము చేయుచుండెడివారు. ఉభయ గోదావరి - కృష్ణా - ఖమ్మం జిల్లాలో వీరి శిష్య బృందము కలదు. వారు నేటికిని యిచటికి వచ్చుట ఆచారముగా చేసికొని శ్రీవారి ఆబ్దికారాధనలను కావించుచున్నారు.



